వృద్ధ పార్టీకి మరణమే శరణ్యం: మంత్రి లక్ష్మారెడ్డి

SMTV Desk 2017-12-22 14:51:03  laxmareddy, miister, comments, congres, revanth

హైదరాబాద్, డిసెంబర్ 22: కాంగ్రెస్ పార్టీని తెలంగాణాలో భూస్థాపితం చేశారని, వృద్ధ పార్టీకి మరణం తప్పదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సీ లక్ష్మారెడ్డి ఎద్దేవా చేశారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో జరిగిన కాంగ్రెస్ సభ జనం లేక విలవిలలాడిందని, కాంగ్రెస్ పై అవిశ్వాసానికి ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో దేశం భ్రష్టు పట్టిందని..తెరాస ప్రభుత్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో దూసుకుపోతుందని ఆయన వివరించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకుండా పారిపోయిన దొంగలు కాంగ్రెస్ నాయకులని ఆయన దుయ్యబట్టారు. మొదటి నుంచి తమది ఆర్థికంగా ఉన్న కుటుంబమేనని, తాను ఇదివరకు రియల్ ఎస్టేట్ వ్యాపారినన్నది నిజమేనని లక్ష్మారెడ్డి తెలిపారు. అంతేతప్ప బ్లాక్ మెయిళ్లు, కమిషన్ల ద్వారా తాను డబ్బులు సంపాదించలేదని పరోక్షంగా రేవంత్‌ను విమర్శించారు. హైదరాబాద్ లో రేవంత్, చంద్రబాబు కంటే పెద్ద ఇల్లు కట్టినావు, అన్ని డబ్బులు అక్రమంగా సంపాది౦చినవేగా అని ఆయన ఆరోపించారు. రాజకీయాల్లో ఉన్నవారు వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలని రేవంత్‌కు ఆయన సూచించారు.