సిద్దిపేటలో పేద క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేసిన హరీశ్...

SMTV Desk 2017-12-20 17:14:17  hareeshrao, dresses, distribution, christians, gajvwel

సిద్ధిపేట, డిసెంబర్ 20: క్రిస్మస్ సందర్భంగా పేద క్రైస్తవులకు తెలంగాణ ప్రభుత్వం దుస్తులు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. పండుగ సమీపిస్తున్న వేళ ఈ కార్యక్రమం వేగం పుంజుకుంది. క్రిస్మస్ ఉత్సవాల సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన సుమారు 3500 పేద క్రైస్తవ కుటుంబాలకు ప్రభుత్వం తరపున మంత్రి హరీష్‌రావు కొత్త దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్రైస్తవులకు గౌరవం పెరిగిందన్నారు. క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకోవాలనేదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని ఆయన పేర్కొన్నారు. 60 ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీ చేయని పనులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ మూడేళ్లలో చేసిందని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన క్రైస్తవ సోదర, సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.