హైదరాబాద్, డిసెంబర్ 20: ముఖ్యఅతిథిగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హాజరవగా ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు కార్యక్రమం ఎల్బీ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరిగింది. అశేష జనవాహిని నడుమ, మిరుమిట్లుగొలిపే బాణసంచా పేలుళ్లతో ముగింపు వేడుకలు జరిగాయి. 42 దేశాలు, 17 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాతం నుంచి తెలుగు అభిమానులు హాజరుకాగా కవులు, రచయితలతో సభ హోరెత్తింది. ప్రజల కలతార ధ్వనుల మధ్య ప్రారంభమైన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం ఆద్యంతం సభికులను ఉర్రూతలూగించింది. ఈ సందర్భంగా తెలుగు భాషాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. ప్రతియేటా డిసెంబర్ లో తెలుగు మహాసభలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రస౦గం చివరలో కేసీఆర్ స్వయంగా రాసిన ఒక తెలుగు నవ్వుల పద్యాన్ని చదివి వినిపించారు. నవ్వవు జంతువుల్ నరుడు నవ్వును నవ్వులు చిత్త వృత్తికిన్ దివ్వెలు కొన్ని నవ్వులెటు తేలవు కొన్ని విషప్రయుక్తముల్ పువ్వులవోలే ప్రేమరసమున్ విరజిమ్ము విశుద్ధమైన లేనవ్వులు..సర్వ దుఃఖదమనంబులు వ్యాధులకున్ మహౌషధంబులు..అని ముగించారు.