హైదరాబాద్, డిసెంబర్ 19 : ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా హైకోర్టులో తెలుగుభాష మురిసింది. తెలుగు భాషను పునరుద్ధరించాలని అందరూ ఘోషిస్తున్న వేళ భూసేకరణ వివాదం కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహాయ న్యాయవాది సోమరాజు తెలుగులో వాదనలు వినిపించి ఆకట్టుకున్నారు. తెలుగులో వాదనలు వినిపించేందుకు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని గౌరవ న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖర్రెడ్డి అంగీకరించారు. వాదనలు పూర్తయ్యాక న్యాయమూర్తి తీర్పు వెలువరించి సమస్యను పరిష్కరించారు. తెలుగులో వాదనలు వినిపించిన న్యాయవాది సోమరాజును పలువురు న్యాయవాదులు అభినందించారు. మాతృభాషలో వాదనలు వినిపించినప్పుడు కలిగిన అనుభూతి వర్ణించలేనిదని న్యాయవాది సోమరాజు పేర్కొన్నారు.