కరీంనగర్, డిసెంబర్ 19 : దేశంలో బీజేపీ వరుస విజయాలు సాధిస్తూ 19 రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చిందని పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధర్రావు పేర్కొన్నారు. దీ౦తో బీజేపీ లక్ష్యమైన కాంగ్రెస్ ముక్త్ భారత్ వైపు పార్టీ దూసుకుపోతుందని ఆయన తెలిపారు. కరీంనగర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గుజరాత్, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాల్లో విజయం సాధించిన భాజపా తదుపరి లక్ష్యం కర్ణాటక అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ తన ప్రాబల్యాన్ని కోల్పోతూ దీన స్థితికి చేరిందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలతో దేశం అన్నివిధాల పురోగమిస్తు౦దని ఆయన వివరించారు. భాజపా బలపడితేనే దేశంలో అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతుందన్నారు. అభివృద్ధి, సుపరిపాలన అందించడమే భాజపా ప్రధాన ఎజెండా అని, ఆ దిశగా ప్రధాని మోదీ చర్యలు చేపట్టారని వెల్లడించారు. వంశ పాలన, కులమత రాజకీయాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు చేటు తెస్తాయని పరోక్షంగా కాంగ్రెస్ను ఆయన విమర్శించారు. తెలంగాణలో భాజపా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని, మతపరమైన రిజర్వేషన్లకు భాజపా ఎప్పుడూ వ్యతిరేకమేనని మురళీధర్రావు తెలిపారు.