హైదరాబాద్, డిసెంబర్ 12: దివంగత నేత ఎలిమినేటి మాధవరెడ్డి సతీమణి, టీడీపీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి, ఆమె కుమారుడు, భువనగిరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు సందీప్రెడ్డి అధికార టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావును కలిసి తమ మనోగతాన్ని వెలిబుచ్చారు. సుధీర్ఘ రాజకీయ నేపధ్యం కలిగిన కుటుంబం కాబట్టి దీనికి ముఖ్యమంత్రి కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ నెల 14న మధ్యాహ్నం 12 గంటలకు తన అనుచరులతో కలిసి ఉమా మాధవరెడ్డి, సందీప్రెడ్డి టీఆర్ఎస్లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని, టీడీపీకి రాష్ట్రంలో భవిష్యత్ లేదని వారు పేర్కొన్నారు.