హైదరాబాద్, డిసెంబర్ 08 : జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ) ఏర్పాటై 60 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా వజ్రోత్సవాలను నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "తెలుగు రాష్ట్రాల మధ్య పోటీ వాతావరణం నెలకొంది. రాజకీయ విభేదాలకు అతీతంగా మనమంతా ఒకే దేశమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ముందు దేశం, ఆ తర్వాత పార్టీ, చిట్టచివరన వ్యక్తి అనే నినాదంతో పనిచేస్తూ ముందుకెళ్లాలి. ఎన్ఎండీసీ, ఓఎన్జీసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు కష్టపడుతున్నాయి కాబట్టే లాభాల్లో కొనసాగుతున్నాయి" అన్నారు. అలాగే ఖనిజాలను వెలికితీసి ఎగుమతులు చేస్తూ లాభాలను సాధించడంలో ఎన్ఎండీసీ కీలక పాత్ర పోషిస్తోందని వెంకయ్యనాయుడు ప్రశంశించారు.