హైదరాబాద్, డిసెంబర్ 07: ఓ చోరీ కేసును దర్యాప్తు చేస్తున్న కూకట్పల్లి పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించేటప్పుడు హైదరాబాద్లో ఓ చెడ్డీ గ్యాంగ్ ఆయుధాలతో సంచరించడం గమనించారు. మియాపూర్, కూకట్ పల్లి ప్రాంతాల్లో ఈ గ్యాంగ్ తిరుగుతున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో నమోదయ్యాయి. అప్రమత్తమైన పోలీసులు కూకట్పల్లి, మియాపూర్ ప్రాంతాల్లో విచారణ చేపట్టారు. దారి దోపిడి చేసి అందిన కాడిన దోచుకునే ముఠాగా పోలీసులు గుర్తించారు. చెడ్డీలు, బనియన్లు ధరించి ముఖానికి ముసుగు వేసుకున్న ఈ గ్యాంగ్లో నాలుగు నుంచి ఏడుగురు సభ్యులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు బెంగళూరు, మహారాష్ట్రలలో దోపిడీలకు పాల్పడ్డ ముఠా తాజాగా నగరంలోకి వచ్చింది. అర్థరాత్రి ఒంటరిగా వెళ్లేవారు, ఇండిపెండెంట్ ఇళ్లే ఈ గ్యాంగ్ టార్గెట్ అని పోలీసులు తెలిపారు. సీసీ టీవీ దృశ్యాలను ఆయా ప్రాంతాల్లో చూపించి స్థానికులకు అవగాహన కల్పిస్తున్నారు. నగరవాసులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. తమ పరిసర ప్రాంతాల్లో అనుమానంగా తిరుగుతున్న వారి గురించి సమాచారం అందించాలని వారు సూచించారు.