అత్యంత ఎత్తులో ఉపగ్రహాల ద్వారా ఎలాంటి అంతరాయం లేని సేవలను అందించే శాటిలైట్ ఫోన్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు బిఎస్ఎన్ఎల్ సిద్ధం అవుతున్నది. రానున్న రెండేళ్ళలో శాటిలైట్ ఫోన్ సేవలను అందించాలనే కృత నిశ్చయంతో కార్యాచరణ కొనసాగిస్తున్నది. దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా శాటిలైట్ ఫోన్ సేవలను వినియోగించుకోవచ్చు. ముఖ్యంగా ప్రకృతి వైపరిత్యాలు సంభవించడం ఇత్యాధి అత్యవసర సమయాల్లో శాటిలైట్ ఫోన్ సేవల ద్వారా ఇబ్బందులను అధిగమించవచ్చు. ఇందుకు సంబంధించి ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ కు దరఖాస్తులు సమర్పించామని వచ్చే రెండు సంవత్సరాల్లోపు శాటిలైట్ ఫోన్ సేవలను అందుబాటులోకి తీసుకరావడం జరుగుతుందని ఆ సంస్థ ఉన్నత వర్గాలు వెల్లడించాయి. భూమి నుండి 35వేల 700 కి.మిఎత్తులో ఉండే ఉపగ్రహాల ద్వారా ఆ ఫోన్ లు పనిచేస్తాయి కాబట్టి ఎలాంటి విపత్తు ఆపద సమయంలోనైనా వాటిని సునాయసంగా వినియోగించుకోనే అవకాశం ఉంటుంది.