హైదరాబాద్, నవంబర్ 28 : హైదరాబాద్ నగర వాసుల కలల ప్రాజెక్ట్ మెట్రో ను దేశ ప్రధాని మోడీ, ఈ రోజు ప్రారంభించడంతో ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రేపటి నుండి మెట్రో రైలు సేవలు భాగ్యనగర వాసులకి అందుబాటులోకి రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సందేహాలను తీర్చడానికి హెల్ప్లైన్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మెట్రోరైలుకి సంబంధించి గానీ, ప్రయాణానికి సంబంధించి గానీ, లేదా మరేదైనా సందేహం, సమస్యల పరిష్కారం కోసం 040-27772999 నెంబర్కి డయల్ చేయాలని హైదరాబాద్ మెట్రో ప్రకటించింది. దాదాపుగా ప్రయాణికులకు ఎలాంటి సమస్యలు రాకుండా హెచ్ఎంఆర్ చర్యలు తీసుకున్నప్పటికీ, ప్రయాణికుల అవగాహనా రాహిత్యం కారణంగా తలెత్తే సమస్యల పరిష్కారానికి ఈ హెల్ప్లైన్ బాగా ఉపయోగపడుతుందని ఆధికారులు తెలిపారు.