హైదరాబాద్, నవంబర్ 28 : భాగ్యనగర వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెట్రో రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. 1:20 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. “హైదరాబాద్ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. హైదరాబాద్ అంటే నాకు మొదట సర్దార్ వల్లభాయి పటేల్ గుర్తుకు వస్తారు. తెలంగాణ విమోచనలో అమరులందరికి నా జోహార్లు” అన్నారు. అనంతరం నేరుగా ప్రత్యేక హెలికాప్టర్ లో మోదీ మియాపూర్ మెట్రో పైలాన్ వద్దకు చేరుకొని, పైలాన్ ను ఆవిష్కరించారు. అక్కడి నుండి మియాపూర్ మెట్రో స్టేషన్ వద్దకు చేరుకొని నగరవాసుల కరతాళధ్వనుల మధ్య మెట్రో రైలును ప్రారంభించారు. అనంతరం మంత్రులు, అధికారులతో కలిసి మెట్రో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను తిలకించారు. టీ సవారీ యాప్ ను ప్రారంభించిన ఆయన కేసీఆర్, గవర్నర్ నరసింహన్, ఇతర మంత్రులు, అధికారులతో కలిసి మియాపూర్ నుండి కూకట్ పల్లి వరకు మెట్రో తొలి ప్రయాణం చేశారు. కాగా మోదీ ప్రయాణించిన మెట్రో రైలును మహిళా లోకో పైలట్ నడపడం విశేషం.