మహబూబ్ నగర్, నవంబర్ 27 : తెలంగాణ పంచాయితీరాజ్ శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావుకు చేదు అనుభవం ఎదురైంది. మహబూబ్ నగర్ జిల్లా కోస్గి మండలం నాగసానిపల్లిలో బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేసేందుకు జూపల్లి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ప్రోటోకాల్ వంక చూపి అడ్డుకున్నారు. కనీసం గ్రామ సర్పంచ్ కూడా లేకుండా శంకుస్థాపన ఎలా చేస్తారని నిలదీశారు. తిరుపతిరెడ్డితో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు శంకుస్థాపన చేయకుండా జూపల్లిని అడ్డుకున్నారు. దీంతో, అక్కడ గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఈ సమయంలో అక్కడ టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని, ఇరు వర్గాల వారికి నచ్చజెప్పారు. అనంతరం, శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని జూపల్లి అక్కడ నుంచి నిష్క్రమించారు. కనీసం మండల అభివృద్ధి అధికారి అయినా శంకుస్థాపనకు ఆహ్వానించక పోవడంపై సర్పంచ్ విస్మయం వ్యక్తం చేశారు.