హైదరాబాద్, నవంబర్ 27: తెలంగాణకు మరో కేంద్ర పురస్కారం వరించింది. అవయవ దానంలో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ నిలిచింది. జాతీయ అవయవ, కణజాల మార్పిడి సంస్థ (నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్) పురస్కారం అందించనుంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని వైద్య సేవల డైరెక్టరేట్.. తెలంగాణను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. సోమవారం ఢిల్లీలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర మంత్రి నడ్డా చేతుల మీదుగా జీవన్దాన్ కార్యక్రమ ఇన్ఛార్జి స్వర్ణలత ఈ పురస్కారాన్ని స్వీకరించనున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వివరించారు. నెక్లెస్రోడ్డులో ఆదివారం ఉదయం నిర్వహించిన ఫ్రీడం హైదరాబాద్ పరుగు కార్యక్రమంలో పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. అవయవ దానంలో అవార్డు రావడం సంతోషకరమని పేర్కొన్నారు. జీవన్దాన్ కింద దేశంలోని అనేక మందికి హైదరాబాద్లోని ప్రభుత్వ వైద్యశాలల్లో అవయవ మార్పిడిలు జరుగుతున్నాయని.. ఒక్క నిమ్స్లోనే వంద కిడ్నీ మార్పిడిలు జరిగాయని గుర్తుచేశారు. ఇదే స్పూర్తితో తెలంగాణాను మరింత ముందుకు తీసుకువెళ్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.