హైదరాబాద్, నవంబరు 21 : తెలంగాణ ఉన్నత విద్యామండలి ఇకపై ప్రవేశ పరీక్షలను ఆన్లైన్ విధానంలో నిర్వహించాలని భావిస్తుంది. వచ్చే విద్యా సంవత్సరానికిగానూ పలు కోర్సులకు సంబంధించిన కార్యాచరణ రూపకల్పనతో పాటుగా సమస్యల పరిష్కారానికి చైర్మన్ పాపిరెడ్డి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఏటా ఎంసెట్కు లక్షకు పైగా, మిగతా సెట్లకు మాత్రం 50వేలలోపు విద్యార్థులు హాజరవుతున్న నేపథ్యంలో ఎంసెట్ మినహా మిగతా సెట్లను ఆన్లైన్లో నిర్వహించడం కష్టం కాకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు ఆన్లైన్ సెట్స్ నిర్వహణపై ఈ కమిటీ కసరత్తు చేయడంతో పాటుగా ఈ నెల 27న కమిటీ సమావేశంలో నివేదిక రూపొందించిన ప్రభుత్వానికి అందించనుంది.