ఘట్కేసర్, నవంబర్ 21 : నేటి సమాజంలో అత్తారిల్లు అంటే ఆడపిల్లలు హడలెత్తిపోతున్నారు. కొన్ని లక్షల కట్నం, ముడుపులుగా బంగారం, ఇంకా వరుడు కోరిన గొంతెమ్మ కోరికలు తీర్చలేక యువతుల తల్లిదండ్రులు పడుతున్న బాధ వర్ణననాతీతం.. ఇవి కాకుండా పెళ్లి తర్వాత అదనపు కట్నం తెమ్మని యువతికి బెదిరింపులు... తాజాగా ఇటువంటి ఘటన ఘట్కేసర్ మండలంలో చోటు చేసుకుంది. ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ బి.ప్రకాష్ కథనం ప్రకారం..ఘట్కేసర్ మండలం ప్రతాప్సింగారం గ్రామానికి చెందిన అశ్విని(26)కి పోచారం పంచాయతీ పరిధి అన్నోజిగూడకు చెందిన బాలగోని సుమన్గౌడ్తో గత ఏడాది డిసెంబరు 8న పెళ్లి జరిగింది. ఆసమయంలో అశ్విని తల్లిదండ్రులు రూ.3లక్షల నగదు, 25 తులాల బంగారు ఆభరణాలు కట్నం కింద ఇచ్చారు. వివాహం జరిగిన వారం రోజుల అనంతరం భార్యతో సంసారం చేయడంపై ఆసక్తి లేదని, ఆమెకు అక్రమ సంబంధం ఉందని భర్త సుమన్ ఆరోపించాడు. పురుగుల మందు తాగాలని, ఉరేసుకోవాలని వేధింపులు అధికం చేశాడు. దీంతో పాటు అత్తమామలు, ఆడపడుచు అదనపు కట్నం తీసుకోవాలని నిత్యం ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సుమన్ సోదరుడు నవీన్ పలుమార్లు కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురిచేశాడని అశ్విని పోలీసులకు ఫిర్యాదు చేసింది. భౌతికంగా, మానసికంగా వేధిస్తున్న భర్త సుమన్, అతని సోదరుడు నవీన్, అత్త మామలు శకుంతల, శంకరయ్య, ఆడపడుచు ప్రతిభలపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. కేసుని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేసి, బాధితులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.