హైదరాబాద్, నవంబర్ 19 : తెలంగాణ శాసనసభ స్పీకర్ గా కొనసాగుతున్న సిరికొండ మధుసూదనా చారికి తన పరిధిలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారన్న పేరూ ఉంది. అలాంటిది ఆయన వచ్చేసారి అసెంబ్లీకి పోటీచేయకపోవచ్చా..? అనే వార్తలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. గత ఎన్నికలలో భూపాలపల్లి నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికైన మధుసూదనా చారికి స్పీకర్ అవకాశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చారు. ఇదిలా ఉండగా భూపాలపల్లి టికెట్ కావాలంటూ పలువురు నేతలు ఇప్పటినుంచే తమ గాడ్ ఫాదర్ల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు ఇటీవల టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి టికెట్ హామీ మేరకే తాను పార్టీలో చేరానని బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్ ను రాజ్యసభకు పంపించే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయాలపై ఎవరు స్పందించకపోవడం గమనార్హం.