భర్త బాకీ కోసం.. భార్యతో వెట్టిచాకిరి చేయించుకున్న ఓ వ్యాపారీ..

SMTV Desk 2017-11-17 11:35:59  miryalaguda, nandigama, Business man,

మిర్యాలగూడ, నవంబర్ 17: డబ్బు కోసం ఆ భార్య భర్తలను నిర్బంధించాడు ఓ వ్యాపారీ. అంతే కాదు ఆయన భార్యను నెల రోజుల పాటు తన ఇంట్లో ఉంచుకొని వెట్టి చాకిరీ చేయించుకున్నాడు. వివరాల్లోకి వెళితే... నందిగామకు చెందిన సింగిరికొండ మోహన్ రావు, మిర్యాలగూడకు చెందిన కనపర్తి సత్యప్రసాద్ లు కొంత డబ్బు పెట్టుబడి పెట్టి, యూరో బనియన్స్, జిందా తిలిస్మాత్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుని వ్యాపారం చేశారు. గొడవలు రావడంతో విడిపోయారు. ఆపై తనకు రావాల్సిన డబ్బు ఇవ్వాలని మోహన్ రావు, సత్యప్రసాద్ పై ఒత్తిడి తెస్తున్నాడు. ఈ క్రమంలో ఓ కోర్టు కేసు నిమిత్తం మిర్యాలగూడకు వచ్చిన మోహన్ రావు దంపతులను డబ్బుకోసం సత్యప్రసాద్ గృహనిర్భంధం చేశాడు. మూడు రోజుల తరువాత డబ్బు తేవాలని బెదిరిస్తూ, మోహన్ రావును వదిలేశాడు. కానీ అతని భార్యను మాత్రం పంపలేదు. ఆమెను బెదిరించి తన ఇంట్లో పనులు చేయించుకున్నాడు. నందిగామ వెళ్లిన మోహన్ రావు, తనకు భార్యతో కలిపి జాయింట్ ఖాతా ఉందని, ఆమె కూడా వస్తేనే డబ్బు తెచ్చే వీలవుతుందని చెప్పడంతో, ఆమెను తీసుకుని నందిగామ వెళ్లారు. బయటపడ్డ మోహన్ రావు దంపతులు నేరుగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ కొనసాగిస్తున్నారు.