మనీలా, నవంబర్ 13 : దేశ ప్రధాని నరేంద్రమోదీ మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం ఫిలిప్పీన్స్ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిధ దేశల నేతలతో సమావేశమైన ఆయన బిజీబిజీగా గడుపుతున్నారు. నేడు ఉదయం లాస్ బానోస్లోని ఇంటర్నేషనల్ రైస్ రీసర్చ్ ఇన్సిస్టిట్యూట్(ఐఆర్ఆర్ఐ)ను సందర్శించారు. అక్కడి భారత శాస్త్రవేత్తలు మోదీతో ముచ్చటించారు. ఆ శాస్త్రవేత్తలు కొత్త రకం వరి వంగడాలను గురించి ప్రధానికి వివరించారు. ఆ తర్వాత అక్కడి విద్యార్థులు, పరిశోధకులతో కూడా ముచ్చటించారు. అనంతరం లాస్బానోస్లోని ‘శ్రీ నరేంద్రమోదీ రీసైలెంట్ రైస్ ఫీల్డ్ లాబొరేటరీ’ని ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా రెండు భారతీయ వరి వంగడాలను ఐఆర్ఆర్ఐకు బహుమతిగా ఇచ్చారు. అక్కడి నుంచి తిరిగి మనీలా చేరుకున్న ప్రధాని మోదీ.. అక్కడి మహవీర్ ఫిలిప్పీన్ ఫౌండేషన్ను సందర్శించారు. చిన్నారుల మధ్య కాసేపు సరదాగా గడిపారు. ఈ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మోదీ ప్రత్యేకంగా సమావేశమై, ఇతర దేశాధినేతలతోనూ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.