హైదరాబాద్, నవంబర్ 10: రైతు పాసు పుస్తకాన్ని చూడగానే కేసీఆర్ బొమ్మ కనిపించాలనే ఉద్దేశంతో భూ రికార్డుల ప్రక్షాళన, కొత్త పాసు పుస్తకాలు జారీ కార్యక్రమాన్ని చేపట్టారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. గురువారం అసెంబ్లీ లాబీల్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ 1932 లో జరిగిన భూ సర్వే నంబర్లనే ఇప్పటివరకు ప్రామాణికంగా తీసుకు౦టున్నామని అన్నారు. భూముల అమ్మకం కారణంగా ఆ సర్వే నంబర్లలో బైలు, ఏబీసీడీలు, అంకెలు వచ్చి చేరాయన్నారు. ప్రభుత్వానికి దమ్ముంటే 1932 నుంచి ఉన్న రికార్డులను సరిచేయాలని ఆయన డిమాండ్ చేశారు. సరైన విధివిధానాలు లేకుండా కార్యక్రమాలు రూపొందించడం సరికాదని ఇది అవగాహన రాహిత్యం అని ఆయన ప్రభుత్వానికి చురకలు వేశారు.