హైదరాబాద్, నవంబర్ 07 : భాగ్య నగరంలో మూడు రోజుల పాటు జరిగిన 10వ అర్భన్ మొబిలిటీ ఇండియా అంతర్జాతీయ సదస్సు ముగిసింది. ఈ సదస్సులో దేశంలోని వివిధ పట్టణాలు, నగరాల నుండి వెయ్యి మంది.. వివిధ దేశాలకు చెందిన వంద మంది వరకు ప్రతినిధులు హాజరయ్యారు. పట్టణాల్లో శరవేగంగా పెరుగుతున్న జనాభాతో ఎదురవుతున్న రవాణా సవాళ్లను అనుసరించాల్సిన విధానాలపై కూలంకషంగా చర్చించారు. రవాణా విధానాలపై దేశ విదేశాల్లో అనుసరిస్తున్న అనుభవాలను పంచుకున్నారు. ఈ క్రమంలో మూడు రోజుల పాటు చర్చించిన అంశాల పైన ఒక ప్రణాళికను తయారు చేయనున్నారు. ఈ నేపథ్యంలో చివరి ముగింపు సదస్సులో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. పట్టణాల్లో రవాణా సవాళ్ళను అధిగమించేందుకు పటిష్టమైన ప్రజా రవాణాను నెలకొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు.