న్యూఢిల్లీ, అక్టోబర్ 14 : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ త్వరలోనే పార్టీ పగ్గాలు చేపట్టడం ఖరారైంది. ఈ విషయాన్ని ఏఐసీసీ అధ్యక్షులు సోనియాగాంధీ ధృవీకరించారు. రాహుల్ పార్టీ పగ్గాలు ఎప్పుడు చేపట్టబోతున్నరని మీడియా ప్రతినిధులు పదే పదే అడిగిన ప్రశ్నకు సోనియా సమాధానం ఇస్తూ త్వరలోనే ఏఐసీసీ అధ్యక్షుడి బాధ్యతలు చేపడతారని చెప్పారు. దీంతో రాహుల్ పటాభిషేకానికి సంబంధించి కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి తెర దించినట్లు అయింది. ఇందు కోసం పార్టీ పరంగా జరగాల్సిన సంస్థ గత కసరత్తు కొనసాగుతుంది. ఇప్పటికే పలు రాష్ట్ర శాఖలు రాహుల్ పార్టీ పగ్గాలు చేపట్టాలంటూ తీర్మానాలు ఆమోదించి ఏఐసీసీకి పంపించాయి. దీపావళి తరువాత రాహుల్ గాంధీ తన తల్లి సోనియా నుంచి పార్టీ పగ్గాలు స్వీకరించనున్నట్లు సమాచారం.