హైదరాబాద్, అక్టోబర్ 08 : కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్వహణ మార్గదర్శకాలపై తెలంగాణ ప్రభుత్వం పలు సవరణలు ప్రతిపాదించింది. ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో చర్చించిన అంశాలకు భిన్నంగా తుది నివేదికలో పేర్కొన్నట్లు తెలిపిన తెలంగాణ ప్రభుత్వం, బోర్డులో అన్ని నిర్ణయాలు ఏకాభిప్రాయంతో తీసుకోవాలని అపెక్స్ కౌన్సిల్ కు పంపేలా మార్పులు చేయాలని కోరింది. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల అధికారులు సభ్యులుగా ఉండగా, ఏదైనా అంశంపై భిన్నాభిప్రాయం వ్యక్తం అవుతే ఛైర్మన్ ఓటుతో తుది నిర్ణయం తీసుకోవాలన్న నిబంధనను తొలగించాలని సూచించింది. అందరికి ఆమోద యోగ్యంగా నిర్ణయాలు జరిగేలా బోర్డు పాత్ర ఉండాలని పేర్కొంటూ తెలంగాణ నీటి పారుదల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్యకార్యదర్శికి లేఖ రాశారు. షెడ్యూల్ 11 అంశాలకే పరిమితం కాకుండా వాటిని తొలగించి కేంద్రం అప్పగించిన విధులను బోర్డు నిర్వతించాలని తెలంగాణ సర్కార్ కోరింది.