హైదరాబాద్, అక్టోబర్ 04 : సోమవారం కురిసిన వర్షంతో పాటు మళ్లీ వర్ష సూచనతో హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ముందస్తు చర్యలు చేపట్టింది. జల మండలి, ట్రాఫిక్ విభాగాలతోపాటు అన్ని శాఖలు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించింది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు రద్దీ మార్గంలో ప్రయాణించ వద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి సూచించారు. వర్షానికి సంబంధించి ఖచ్చితమైన సమాచారం వాతావరణ శాఖ ద్వారా అందుతుందని, మ్యాప్ ద్వారా పరిస్థితిని తెలుసుకుంటే కొంత ఇబ్బందులు తగ్గుతాయని వెల్లడించారు. ట్రాఫిక్ కష్టాలు తొలగించేందుకు అన్ని చర్యలు చేపట్టామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అండగా నిలిచేందుకు జలమండలి సిబ్బంది క్షేత్ర స్థాయిలో పని చేయాలని ఆ సంస్థ ఎండీ కిషోర్ ఆదేశించారు. నగర జలమండలి కేంద్ర కార్యాలయాల్లో అత్యవసర సమావేశం నిర్వహించిన ఆయన ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.