హైదరాబాద్, అక్టోబర్ 3 : జాతీయ స్థాయిలో ప్రకటించిన స్వచ్ఛ అవార్డుల్లో తెలంగాణ మూడు పురస్కారాలను దక్కించుకుంది. స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా మూడో వార్షికోత్సవంలో తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రులు హర్దీప్సింగ్పురి, ఎస్ఎస్ అహ్లూవాలియా ఈ పురస్కారాలను అందజేశారు. బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు స్వచ్ఛ దర్శన్ పురస్కారాలను అందజేశారు. ఈ పురస్కారాలను ఆయా జిల్లాల కలెక్టర్లు శరత్, కృష్ణభాస్కర్లు అందుకున్నారు. డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్ (డీఆర్సీసీ) నిర్వహణలో సిద్దిపేట, సిరిసిల్ల పురపాలక సంఘాలకు సంయుక్తంగా అవార్డు దక్కింది. తెలంగాణ మిషన్ డైరెక్టర్ శ్రీదేవి, సిరిసిల్ల, సిద్దిపేట మున్సిపల్ కమిషనర్లు రామాంజుల రెడ్డి, రమణాచారి ఈ అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా పురస్కారాలను అందుకున్న అధికారులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.