హైదరాబాద్, అక్టోబర్ 03 : సింగరేణి లో కార్మికులను మరోసారి మోసం చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎత్తేస్తున్నారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. కారుణ్య నియామకాలు, వారసత్వ ఉద్యోగాల మధ్య చాలా తేడా ఉందన్న భట్టి, రెండు ఒక్కటే అంటే న్యాయ సమీక్షలో చెల్లుబాటు అవుతుందా అని ప్రశ్నించారు. మహాత్మాగాంధీ జయంతి పురస్కరించుకుని నివాళులు అర్పించిన ఆయన, గాంధీ విధానాలకు విరుద్ధంగా దేశంలో పరిపాలన కొనసాగుతుందని విమర్శించారు. గ్రామ స్వరాజ్యాన్ని సైతం తెరాస ప్రభుత్వం నాశనం చేస్తున్నదని, గ్రామ పంచాయితీలకు ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చే నిధులను దోచుకుంటున్నదని ఆరోపించారు. రైతులు తమ ఆత్మ గౌరవాన్ని తెరాస వద్ద తాకట్టు పెట్టడానికి సిద్ధంగా లేరంటూ, ఆయన జీవో 39, 42లకు వ్యతిరేకంగా సత్యాగ్రహ దీక్షలు చేపడతామన్నారు.