హైదరాబాద్, సెప్టెంబర్ 25 : మంచి నాయకుడిగా రానించుకోవలనుకునే వారు అహంకారం, గర్వం దరిచేరకుండా చూసుకోవాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. కొన్ని విజయాలు సొంతం చేసుకున్న తరువాత, విజయ గర్వం తలకెక్కితే భవిషత్తు అంధకారం అవుతుందని హైదరాబాద్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో నాయకత్వ సదస్సులో ఆయన హితవు పలికారు. వాతావరణ కాలుష్య నివారణే ప్రాధాన్యంగా విద్యుత్ వాహనాల తయారీకి ప్రాధాన్యం ఇవ్వాలని వాహన తయారీ సంస్థలకు మంత్రి సూచించారు. భారత్ నుంచి రూ.1.5 లక్షల కోట్ల విలువైన వాహన ఎగుమతులు జరుగుతున్నాయనీ, దీన్ని ఆటంకపరిచే ఉద్దేశమేమీ తమకు లేదన్నారు. దేశంలో పెద్దఎత్తున ఉపాధి కల్పిస్తున్న వాటిల్లో వాహన రంగం ఒకటన్నారు. దేశంలో బొగ్గు, ఇంధనం కన్నా విద్యుత్ ఖర్చు తక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలకు మేలు జరగడంతోపాటు, పర్యావరణానికి మేలు చేకూర్చేందుకే విద్యుత్ వాహనాలకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఈ సమావేశానికి బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ కూడా హజరయ్యారు. ఐఎస్బీ కోర్సు చేస్తున్న వారు మంచి వ్యాపారవేత్తగా రాణించడానికి కావాల్సిన నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలని గడ్కరీ స్పష్టం చేశారు.