హైదరాబాద్, సెప్టెంబర్ 22 : హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరంలో ప్రళయ సాహసం పేరిట సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిర్వహించిన మాక్ డ్రిల్ విశేషంగా ఆకట్టుకుంది. భాగ్యనగరంలో భారీ వరదలు సంభవిస్తే మునిగిన ఇళ్లు, భవనాల నుంచి ప్రజలను ఏ విధంగా రక్షించాలన్న విషయంపై నేడు మాక్ డ్రిల్ ను నిర్వహించారు. హెలికాప్టర్ నుంచి సాగర్ లోకి సైన్యం తాడు సాయంతో కిందకు దిగింది. అక్కడి నుంచి పడవల ద్వారా నీట మునిగిన భవంతుల వద్ద చిక్కుకున్న బాధితులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఇలా అనుకోని విపత్తు సంభవిస్తే ప్రజలను ఏ విధంగా రక్షిస్తారో కళ్లకు కట్టినట్లు చూపించడం జరిగింది. కాగా, రెండు రోజులపాటు కొనసాగే ఈ కార్యక్రమాన్ని పలువురు సైనికాధికారులు వీక్షించారు. శనివారం జరుగబోయే మాక్ డ్రిల్ కు మంత్రులతో పాటు మరికొంత మంది ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందని సైనిక వర్గాలు తెలిపాయి. ఈ విన్యాసాన్ని సందర్శకులు చూసేందుకు సంజీవయ్యా పార్కు, ట్యాంక్ బ్యాండ్, బతుకమ్మ ఘాట్ వద్ద అనుమతిస్తారు.