హైదరాబాద్, సెప్టెంబర్ 21 : దేశంలో ఇప్పటి వరకు కేవలం 15 లోపే సూపర్ కంప్యూటర్లు ఉన్నాయి. ప్రపంచంలో అంత్యంత వేగంగా పని చేసే మొదటి 500 కంపూటర్లల్లో మన దేశంలో ఉన్నవాటిని వేళ్లమీద లెక్కించవచ్చు. వివిధ రంగాలకు వీటి అవసరం పెరిగిపోవడంతో, దేశ వ్యాప్తంగా వీటి విస్తృతి పెంచాలని భావించిన కేంద్రం 2011 లో రూ. 4 వేల కోట్లతో సూపర్ కంప్యూటర్ మిషన్ కు స్వీకరం చుట్టింది. ఈ కంపూటర్లు విద్యా పరిశోధన సంస్థలకు అందించి దేశపురోభివృద్ధికి ప్రణాళికలు రచించిన అవి కార్యరూపం దల్చాలేదు. ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక మళ్లీ ఈ ప్రాజెక్టును తెర పైకి తెచ్చారు. ఈ క్రమంలోనే మొదటి విడతకింద ప్రతిపాదనలు ఆహ్వానించారు. 100 సంస్థలను వడబోసి కేవలం మూడింటిని మాత్రమే ఎంపిక చేశారు. అందులో ఐఐటీ కాన్పూర్, బెంగళూరులోని జవహర్ లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైన్టిఫిక్ రీసెర్చ్ తో పాటు ఐఐటీ హైదరాబాద్ ఎంపికైంది. సూపర్ కంప్యూటర్ ఇస్తే కేవలం తమ సంస్థ అవసరాలు, పరిశోధనకు మాత్రమే కాకుండా పరిశ్రమలు, ప్రభుత్వం శాఖలు అంకురా సంస్థలకు స్థానిక విశ్వవిద్యాలయాలు కూడా ఉపయోగించుకునేందుకు అవకాశం కల్పిస్తామని ఐఐటీ హైదరాబాద్ చేసిన ప్రతిపాదన నచ్చడంతో కేంద్రం సూపర్ కంప్యూటర్ ను కేటాయించడం జరిగింది. ఒక టెరాప్లాప్స్ అంటే సెకనులో లక్ష కోట్ల కార్యకలాపాలు చేసే సూపర్ కంప్యూటర్ ని సొంతం చేసుకోబోతుంది. ఐఐటీ హైదరాబాద్ కు రానున్న సూపర్ కంప్యూటర్ ను రక్షణ, అంతరిక్ష, వాతావరణ, వైద్య రంగాలకు ప్రయోజనకరంగా ఉండేలా తయారు చేస్తున్నారు. పరిశ్రమలు, వాణిజ్యం తదితర ఏ రంగాల్లోనైన భారీ సమాచారాన్ని అత్యంత వేగంగా విశ్లేషించవచ్చును. ఒక్క మాటలో చెప్పాలంటే దశాబ్దాల పాటు చేసే పనిని సూపర్ కంప్యూటర్ నిమిషాల్లో చేసేస్తుంది.