హైదరాబాద్, సెప్టెంబర్ 12 : రాష్ట్రంలోని పేద మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ ఈ నెల 20 లోపు పూర్తి కావాలని ప్రభుత్వం ఆదేశించింది. క్యాంపు కార్యాలయంలో బతుకమ్మ చీరల పంపిణీ గురించి నిర్వహించిన సమీక్షలో ఆ శాఖ కమిషనర్ శైలజారామయ్యర్, తెలంగాణ చేనేత, జౌళి శాఖల మంత్రి కేటీఆర్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మంత్రి మాట్లాడుతూ.. కేవలం రెండు నెలల వ్యవధిలో కోటి ఆరు లక్షల మంది ఆడపడుచులకు చీరలను అందిస్తున్నాం. వచ్చే ఏడాది నుంచి బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ వంటి పర్వదినాలు, రాజీవ్ విద్యామిషన్ వంటి ప్రభుత్వ పథకాలకు అవసరమైన వస్త్రాలను పూర్తిగా రాష్ట్రంలోనే సేకరిస్తామని, నేతన్నల పూర్తి ఉత్పాదక సామర్థ్యాన్ని వినియోగించేందుకు వార్షిక ప్రణాళికను త్వరలో విడుదల చేస్తామని కేటీఆర్ తెలిపారు. నేతన్నలకు ప్రతీయేటా ఎనిమిదేసి నెలలు ప్రభుత్వం సేకరించే వస్త్రాల ద్వారానే ఉపాధి కలుగుతొందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వమిస్తున్న ఆర్డర్లతో నెలకు రూ.15 వేల చొప్పున వేతనం మూడు నెలల పాటు లభిస్తుందన్నారు. కాగా, అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలన్నారు.