హైదరాబాద్, సెప్టెంబర్ 5: నవ రాత్రులు, విశేష పూజలు అందుకున్న ప్రఖ్యాతి చెందిన హైదరాబాద్లోని ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ముగిసింది. గతంలో అర్ధరాత్రి సమయంలో ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర ప్రారంభమయ్యేదన్న విషయం తెలిసిందే. చరిత్రలో రెండోసారి ఖైరతాబాద్ మహాగణనాథుడి నిమజ్జనం మధ్యాహ్నమే ముగిసింది. అశేష భక్తజన సందోహం నడుమ ఆ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. మహాగణనాదుని నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకున్నారు. ఈ రోజు ఉదయం నుంచే గణనాథులను చూసేందుకు భారీ ఎత్తున ప్రజలు ట్యాంక్ బండ్ వద్దకు తరలివచ్చారు. మరోవైపు హైదరాబాద్లోని పలు ప్రాంతాల నుంచి విఘ్నేశ్వరుని ప్రతిమలు ట్యాంక్బండ్ దిశగా తరలివస్తున్నాయి.