హైదరాబాద్, ఆగస్ట్18 : జాతీయ రహదారి మీద వెళుతుంటే నలబై, యాబై, కిలోమీటర్లకు ఒక టోల్ ప్లాజా తగులుతూ ఉంటుంది. టోల్ వసూళ్ల కోసం ఫాస్టాగ్లను అందజేస్తున్న జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ), వాటిని ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నారు. అంతేకాకుండా కామన్ సర్వీసెస్ సెంటర్ (సీఎస్సీ) ద్వారా వాటిని విక్రయించేందుకు ఫాస్టాగ్ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నారు. వచ్చేనెల 1వ తేదీ నుంచి ఫాస్టాగ్ ఉన్న వాహనాలను టోల్గేట్ల వద్ద ప్రత్యేక లైన్ ద్వారా అనుమతి౦చనున్నారు. ఈ ఫాస్టాగ్లను వాహనాదారులు బ్యాంకులు, ఎన్హెచ్ఏఐ, ఐహెచ్ఎంసీఎల్ వెబ్సైట్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబ౦ధించి మైఫాస్ట్, ఫాస్టాగ్ పార్టనర్ అనే రెండు యాప్లు ఎన్హెచ్ఏఐ ఆవిష్కరించింది. దీనికోసం వాహనదారులు చేయవలసిందల్లా మైఫాస్ట్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఫాస్టాగ్ను కొనుగోలూ చేయాలి. లేదంటే రీఛార్జీ కూడా చేసుకోవచ్చని సంస్థ పేర్కొంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 6 లక్షల ఫాస్టాగ్ల విక్రయాలు జరిగాయని, ఈ చర్యలతో మరింత వేగంగా విక్రయాలు పెరుగుతాయని ఎన్హెచ్ఏఐ పేర్కొంది. ఈ ఫాస్టాగ్లను వాహనం ముందు అద్దానికి అతికిస్తారు. దీంతో వాహనం టోల్గేట్ ముందుకు రాగానే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా ఆటోమేటిక్ గా గేటు ఓపెన్ అవుతుంది. వెంటనే ప్రీపెయిడ్ అకౌంట్ నుంచి టోల్ ఫీ కట్ అవుతుంది. దీని వల్ల వాహనదారులు టోల్గేట్ వద్ద ఆగాల్సిన అవసరం లేకుండా నేరుగా వెళ్లిపోవచ్చు.