హైదరాబాద్, మార్చ్ 07: గత కొన్ని రోజుల నుండి ఎండ సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తుంది .. ఈ నేపథ్యంలో .. తెలంగాణలో ఎండలు పెరిగిపోయాయని, సమీప భవిష్యత్తులో ఉష్ణోగ్రత మరింతగా పెరుగుతుందని, ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ, రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంస్థ హెచ్చరించింది. వడగాల్పుల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది.
ఈ మేరకు ఓ గోడపత్రికను ఆవిష్కరించిన అధికారులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఆరుబయట పనిచేసే వారు తలపైన టోపీని తప్పనిసరిగా ధరించాలని, కాఫీలు, టీలు ఎక్కువగా తగారాదని, ప్రమాదవశాత్తూ వడదెబ్బ తగిలితే, సదరు వ్యక్తి తలకు చల్లటి వస్త్రాన్ని చుట్టాలని సూచించింది. సాధ్యమైనంత వరకూ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ బయట తిరగరాదని, ఒకవేళ వెళ్లాల్సి వస్తే, గొడుగు వాడకాన్ని మరువరాదని తెలిపింది.
ఈ నేపథ్యంలో .. ఎండవేళ, ప్రజలకు మంచినీళ్లను అందించేందుకు హైదరాబాద్ తో పాటు ఇతర నగరాలు, పట్టణాల్లోని పలు ప్రాంతాల్లో చలివేంద్రాల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నట్టు ప్రకటించింది.