హైదరాబాద్, మార్చి 7: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నెల 9న హైదరాబాద్ రానున్నారు. శంషాబాద్లో ఆయన బహిరంగసభలో పాల్గొననున్నారు. ఈ సభను విజయవంతం చెయ్యాలని పార్టీ శ్రేణులకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. రాహుల్ గాంధీ రాకకు ఏర్పాట్లపై చర్చించేందుకు బుధవారం ఇక్కడి గాంధీభవన్లో సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి, ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసకృష్ణన్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, పార్టీ ముఖ్యనేతలు పొన్నాల లక్ష్మయ్య, జైపాల్రెడ్డి, గీతారెడ్డి, దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, రోహిత్రెడ్డి, సీతక్క, హరిప్రియ నాయక్లతోపాటు తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికల ప్రచార శంఖరావం మొగించెందుకే రాష్ట్రానికి వస్తున్న రాహుల్ సభను విజయవంతం చెయ్యలని నాయకులను కోరారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుండి కోలుకొని లోక్ సభ ఎన్నికలపై నాయకుల దృష్టి మళ్ళించేందుకు ఈ సభను ఉపయోగించుకోవాలని, రాహుల్ సభ స్ఫూర్తితో రానున్న ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ను దీటుగా ఎదుర్కొంటామనే సంకేతాలిచ్చే విధంగా పెద్దఎత్తున జనసమీకరణ జరపాలని కోరారు. ఎన్నికల షెడ్యూల్ కూడా రేపో, మాపో అంటున్న వేళ జరుగుతున్న రాహుల్ బహిరంగసభ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీపై భరోసా కలిగించేలా నేతలు పనిచేయాలని కోరారు.