హైదరాబాద్, ఫిబ్రవరి 8: ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో కొత్త విషయం బయటికి వచ్చింది. తాజాగా ఆయన హత్య కేసును తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించగా హైదరాబాదు పోలీసులు కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. చిగురుపాటి జయరాం హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన మేనకోడలు శిఖా చౌదరి కాల్ లిస్టులో ఓ యువ క్రికెటర్ పేరు ఉన్నట్లు సమాచారం. కాగా హత్య జరిగిన రోజు శిఖా చౌదరి విల్లాకు ఆ క్రికెటర్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ క్రికెటర్ పేరు ఇంకా బయటకి రాలేదు. కాగా అతను ఐపిఎల్ మ్యాచులు కూడా ఆడినట్లు తెలుస్తుంది. హత్యకు గురైన జయరాం చివరి కాల్ కూడా శిఖా చౌదరికే వెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు.
జయరాం హత్య హత్యకు గురైన ముందు రోజు రాత్రి ఎనిమిది గంటల వరకు శిఖా చౌదరి ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా జయరాం భార్య పద్మశ్రీ హైదరాబాదుకు రాకముందే డాక్యుమెంట్లు తెచ్చుకోవాలని తల్లి శిఖా చౌదరికి చెప్పినట్లు, దాంతో శిఖా చౌదరి సంతోష్ అనే వ్యక్తితో హత్య జరిగిన రోజునే జయరాం ఇంటికి వెళ్లినట్లు తెలిసింది. అయితే తన భర్త హత్య విషయంలో శిఖా చౌదరినే జయరాం భార్య అనుమానిస్తున్న విషయం తెలిసిందే.