హైదరాబాద్, ఫిబ్రవరి 08: కోస్టల్ బ్యాంకు చైర్మన్, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం హత్యా కేసులో ఆయన మేనకోడలు శిఖా చౌదరి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే శిఖా చౌదరి గురువారం మీడియా ముందుకు వచ్చి పలు విషయాలు వెల్లడించింది.
జయరాం రూ.4 కోట్లు అప్పుగా తీసుకున్న రాకేశ్ రెడ్డి తో తనకు 2017లో పరిచయమైందని తెలిపింది. టెట్రాన్ కంపెనీలో కార్మికులతో సమస్య వచ్చినప్పుడు దానిని పరిష్కరించేందుకు వచ్చాడని, అప్పుడే అతడితో పరిచయం ఏర్పడిందని శిఖా పేర్కొంది. అప్పటి వరకు రాకేశ్ ఎవరో మామయ్య జయరాంకు తెలియదని పేర్కొంది. తనకు రాకేశ్ తరచు ఫోన్ చేస్తుండడంతో అతని ప్రవర్తన నచ్చక గత 9 నెలలుగా దూరం పెట్టానని తెలిపింది.
మామయ్య అతడి దగ్గరే నాలుగు కోట్లు తీసుకున్నారన్న విషయం ఆయన చనిపోయాకే తనకు తెలిసిందని చెప్పుకొచ్చింది. డబ్బులు ఇవ్వకపోవడం వల్లే రాకేశ్ ఈ హత్య చేశాడని భావిస్తున్నట్టు శిఖా చౌదరి తెలిపింది.