హైదరాబాద్, ఆగష్టు 1 : అమ్మాయిలపై రోజు రోజుకి అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలున్నా ఎన్ని శిక్షలు అమలు పరిచిన ఏదో ఒక రకంగా మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఉద్యోగం వచ్చిందని కార్యాలయానికి పిలిపించి మత్తు మందు కలిపిన జ్యూస్ ఇచ్చి యువతి పై లైంగిక దాడి జరిపిన సంఘటన బంజారాహిల్స్ లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 10 కి చెందిన కేపీఆర్ ఇంటర్ కాంటినెంటల్ కంపెనీ యజమాని రాజశేఖర్ రెడ్డి, ఉద్యోగులు కావాలని ప్రకటించగా ఓ యువతి(29) దరఖాస్తు చేసుకుంది. కాగా ఇంటర్వ్యూ అనంతరం మార్చి 6న ఆమెకు ఉద్యోగం వచ్చినట్టు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. ఈ క్రమంలో ఏప్రిల్ 30న జీతం గురించి మాట్లాడడానికి కార్యాలయానికి వెళ్ళగా అక్కడి సిబ్బంది ఆమెకు జ్యూస్ తో పాటు, గులాబ్జామున్ కూడా ఇచ్చారు. ఆ జ్యూస్ తాగిన యువతి స్పృహ తప్పి పడిపోవడంతో ఆమెను గదిలోకి తీసుకువెళ్లి రాజశేఖర్రెడ్డి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత యువతి ఇంటికి చేరుకున్న అనంతరం రాజశేఖర్రెడ్డి ఫోన్ చేసి విషయాన్ని బయటకు చెబితే అసభ్యకరమైన చిత్రాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆ బాధిత యువతి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.