హైదరాబాద్, ఫిబ్రవరి 2: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి కోలుకొని నుమాయిష్ మళ్లీ ప్రారంభం కానుంది. నుమాయిష్ ప్రారంభానికి పనులు జోరుగా సాగుతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఎగ్జిబిషన్ను పునఃప్రారంభించనున్నారు. వీకెండ్ కావడం వల్ల సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యం లో నిర్వాహకులు ఏ ప్రమాదం జరగకుండా భద్రత ఏర్పాట్లు చేసారు. ముందు జాగ్రతగా 4 అగ్నిమాపక శకటాలు, 26 మంది అగ్నిమాపక సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఈ ఎగ్జిబిషన్ను ఈనెల 28వ తేదీ వరకు కొనసాగించాలని యోచిస్తున్నామని, దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సొసైటీ నిర్వాహకులు తెలిపారు.
నుమాయిష్ లో రెండు రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు ౩౦౦ స్టాళ్లు మంటల్లో దగ్దం అయ్యాయి. రూ. 33 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా వేసారు. దాదాపు ౩౦౦ మంది సిబ్బంది ఇతర యంత్రాంగంతో కూలిన షెడ్డులు తొలగించి స్టాల్స్ నిర్మాణం పూర్తిచేసే పనులు చేపట్టారు. శుక్రవారం సాయంత్రానికి వంద స్టాళ్ల నిర్మాణం పూర్తి కాగా, ఈరోజు మధ్యాహ్నం వరకు మొత్తం స్టాళ్ళ నిర్మాణం పూర్తి చేయనున్నారు.