నల్గొండ, జనవరి 28: నల్గొండ జిల్లాకు చెందిన భార్యాభర్తలు కట్టెకోల నరసింహారావు, వాణిశ్రీ హైదరాబాద్లో బంధువుల ఇంట జరుగుతున్న పెళ్లికి హాజరయ్యేందుకు ఆర్టీసీ బస్సెక్కారు. ఈ క్రమంలో కట్టుకున్న పట్టుచీర బస్సు ప్రవేశ ద్వారం వద్ద బయటకు తేలిన రేకుకు తాకి చిరిగిపోయింది. దీంతో ఉసూరుమన్న వాణిశ్రీ బస్సు డ్రైవర్ను రేకు సరిచెయ్యమని కోరింది, అయితే, అది తమ పని కాదని, డిపో వ్యవహారమని డ్రైవర్ తేల్చి చెప్పాడు.
దీంతో దంపతులు డిపో మేనేజర్ కు ఫిర్యాదు చేశారు. ఆయన కూడా పట్టించుకోకపోవడంతో వారు ప్రయాణించిన బస్సు టికెట్, బయటకు తేలిన ఇనుప రేకు, బస్సు ఫొటోలతో నల్గొండలోని వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. ఈ ఘటన గతేడాది ఆగస్టు 26న జరిగింది. విచారణ చేపట్టిన ఫోరం ఆర్టీసీ బస్సులో లోపాలు నిజమేనని నిర్ధారించింది. పట్టు చీరకు రూ. 2 వేలు, ఇతర ఖర్చులకింద మరో వెయ్యి రూపాయలు జరిమానాను చెల్లించాల్సిందిగా ఆర్టీసీని ఆదేశించింది.