నిర్మల్, జనవరి 11: ఈ రోజు ఉదయం నిర్మల్ లోని అటవీ శాఖ అధికారులు పట్టణంలోని మార్కెట్ లలో తనిఖీలు నిర్వహించారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు పర్యావరణానికి, పక్షులకు హానికలిగించే ప్లాస్టిక్, నైలాన్ చైనా మాంజాలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అటవీశాఖ తనిఖీలు నిర్వహిస్తుంది. ప్లాస్టిక్, నైలాన్ చైనా మాంజాల తయారీ, అమ్మకాలు, నిల్వ, సరఫరాచేయరాదని సూచించారు.
వీటితోపాటు సంక్రాంతి సందర్భంగా పతంగులను ఎగుర వేసేందుకు పదునైన దారాలను వాడరాదని, గాజు, ఇనుము వంటి వస్తువులను దారాలకు కట్టి ఎగురవేయరాదని వ్యాపారులకు తెలిపారు. పర్యావరణానికి, పక్షులకు తీవ్రమైన హాని కలుగుతున్నదని పేర్కొన్నారు. నూలుపోగులతో తయారైన దారాలను మాత్రమే పతంగులు ఎగురవేసేందుకు ఉపయోగించాలని సూచించారు.