రాత్రి 7 తర్వాత కేటీఆర్ ఎక్కడకు వెళ్తున్నారో తెలుసా? : రేవంత్ రెడ్డి

SMTV Desk 2017-07-28 17:00:39  REVANTH REDDY, KTR, KCR, HYDERABAD ,DRUGS

హైదరాబాద్, జూలై 28 : డ్రగ్స్ వ్యవహారంలో సినీ పరిశ్రమలోని కొందరు ప్రముఖులను ఇప్పటికే సిట్ అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో టీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ నగరం డ్రగ్స్ హబ్ గా మారిందని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. డ్రగ్స్ వాడుతున్న వారిని విచారిస్తున్నారు కాని, వాటి మూలాలను వెతికే ప్రయత్నం చేయడం లేదని ఆయన మండిపడ్డారు. గత 60 ఏళ్ల కాలంలో కేవలం 5-6 పబ్ లకు మాత్రమే అనుమతినిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మూడేళ్ల పాలనలో ఏకంగా 57 పబ్ లకు అనుమతి ఇచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు చదువుతున్న స్కూల్లోనే డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయంటూ, అసలు తన కుమారుడు కేటీఆర్ రాత్రి 7 గంటల తర్వాత ఎక్కడకు వెళ్తున్నారో కేసీఆర్ కు తెలుసా? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారాలను కేసీఆర్ ప్రోత్సహిస్తారని భావించడం లేదని కనీసం నిఘా వ్యవస్థ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా.. డ్రగ్స్ అమ్మేవారిని ఎన్ కౌంటర్ చేసి చంపాలని దీనికి తాము కూడా మద్దతు ఇస్తామని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.