హైదరాబాద్, జనవరి 2: నగరంలో వొకే రోజు 9 చైన్ స్నాచింగ్ లకు పాల్పడి సంచలనం సృష్టించిన దొంగలను హైదరాబాద్ టాస్క్ ఫోర్సు పోలీసులు ఢిల్లీ లో పట్టుకున్నారు. గత బుధవారం ఎల్బీనగర్, హయత్నగర్ ప్రాంతాల్లో 15 గంటల వ్యవధిలో ఏకంగా 9 చైన్ స్నాచింగ్ ఘటనలు చోటు చేసుకోవడంతో నగరం ఉలిక్కిపడింది. దీనిని తీవ్రంగా పరిగణించిన రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటుచేసి దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
స్నాచింగ్కు పాల్పడిన వారు యూపీకి చెందిన వారుగా గుర్తించారు. వీరు విమానంలో యూపీ నుంచి హైదరాబాద్కు వచ్చి మరీ, ఈ వరుస స్నాచింగ్లకు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. స్నాచింగ్కు పాల్పడిన అనంతరం సొమ్మును తీసుకుని వీరు విమానంలో తిరిగి యూపీ పారిపోయినట్లు తెలిసింది. దీంతో కమిషనర్ ఆదేశాల మేరకు వొక బృందం ఢిల్లీ వెళ్లి ఇద్దరు దొంగలను పట్టుకుంది.