హైదరాబాద్ /శంషాబాద్, డిసెంబర్ 23: నగర సమీపంలో కొత్వాల్ గూడ లో విషాదం చోటుచేసుకుంది.ఆదివారం సెలవురోజు రావడంతో సరదాగా గడపడానికి గ్రామ సమీపంలోని ఓ క్వారీ గుంతలో ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు మృత్యువాతపడ్డారు. మృతుల్లో వొకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు వున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన ఐదుగురు స్నేహితులు సరదాగా ఈతకొట్టడానికని మానవహిల్స్ క్వారీ గుంత వద్దకు వెళ్లారు.
అయితే ఇందులో ముగ్గురు యువకులు ఈత కొట్టడానికి నీళ్లలో దిగి మునిగిపోయారు. ఈ దుర్ఘటనలో మృతిచెందిన యువకులు భార్గవ్, సూర్య, చంద్ర లుగా గుర్తించారు. భార్గవ్, సూర్యలు సొంత అన్నదమ్ముళ్లు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో ఇద్దరు యువకుల మృతదేహాలను బయటకు తీశారు. మరో మృతదేహం కోసం క్వారీ గుంతలో గాలింపు చేపట్టారు.