ఖమ్మం, డిసెంబర్ 23: టీఅరెస్ లో విలీనం కోరుకున్న నేతలపై ఈ మధ్య ఎన్నికల్లో ఓటమిపాలైన సత్తుపల్లి టీఆర్ఎస్ ఇంచార్జి పిడమర్తి రవి తీవ్ర వ్యతిరేఖ వాఖ్యలు చేశారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, అశ్వారావు పేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావు టీఆర్ఎస్ నాయకులతో టచ్ లో వున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వీరు తెరాసలోకి వస్తున్నారని ప్రచారం జరుగుతోంది. సత్తుపల్లిలో నిర్వహించిన టీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో పిడమర్తి రవి మాట్లాడుతూ సండ్రపై పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన నాయకులు ఇప్పుడు ప్రగతిభవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటే ఆయన బూట్లు నాకేందుకు కూడా సిద్దంగా వున్నారంటూ పిడమర్తి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ఎంపి పొంగులేటిలను కూడా ఆ నాయకులు తీవ్రంగా దూషించారని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు అదే నాయకులు వారిచెంతకే చేరి పార్టీలో చేరడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. రాజకీయాలను అపహాస్యం చేసే ఇలాంటి నాయకులను పార్టీలో చేర్చుకోవడం మంచిది కాదని అటువంటి రాజకీయ నాయకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పిడమర్తి రవి కార్యకర్తలకు సూచించారు.