హైదరాబాద్, డిసెంబర్ 17: తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ తెలంగాణ భవన్ లో ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. కేటీఆర్ భారీ ర్యాలీ నడుమ బసవతారకం ఆసుపత్రి నుంచి తెలంగాణ భవన్ వచ్చారు. తొలుత తెలంగాణ తల్లికి పూలమాలలు వేసి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ప్రొఫిసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహ్మద్ అలీ, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితర నాయకులూ పాల్గొన్నారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ జరిగిన ఎన్నికల్లో ప్రజలు అఖండమైన మెజార్టీ ఇచ్చి బంగారు తెలంగాణ దిశగా ముందుకు సాగమని తెరాసని ఆశీర్వదించారు. టిఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని మలచడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ఈ ముఖ్యమైన బాధ్యతను అప్పగించారు. మీఅందరిలో వొకడిగా ఉంటూ తెరాస పార్టీ తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా పేదలకు, రైతులకు అండగా ఉండే దిశగా మలచడానికి అందరు ఆశీస్సులు అందజేయాలని కోరుకుంటున్నానన్నారు. రాష్ట్ర నలుమూల నుంచి ఈ కార్యక్రమానికి వచ్చిన అన్నదమ్ములకు, అక్కచెళ్లేలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు.