హైదరాబాద్, డిసెంబర్ 17: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంతో తెలంగాణలోని జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల సంఖ్య పెరగనుంది. రాష్ట్రంలోని పల్లెల రూపు రేఖలను మార్చేందుకు కేసీఆర్ సన్నద్ధమయ్యారు. పల్లెలు, గ్రామాలు పాడి పంటలతో మురిసిపోవాలని, పచ్చదనం, పరిశుభ్రత ఉట్టిపడేలా వాటిని తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ప్రగతి భవన్ లో పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం కెసిఆర్ ఈ మేరకు ఆదేశించారు.
2016లో పాలనా సౌలభ్యం కోసం జిల్లాల సంఖ్యను 10 నుంచి 31కి పెంచారు. ఆ తర్వాత కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి. జరిగిన ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మరో రెండు కొత్త జిల్లాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ములుగు, నారాయణపేట్ లను జిల్లాలుగా ఏర్పాటు చేయాలని.. గ్రామాలు బాగుంటేనే రాష్ట్రాలు, దేశం బాగుంటుందని కేసీఆర్ అన్నారు. ప్రతి పంచాయతీకి వొక కార్యదర్శిని నియమించాలని చెప్పారు. పంచాయతీ ఎన్నికలు పూర్తైన వెంటనే పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.