హైదరాబాద్ , డిసెంబర్ 17: తెలంగాణకు రెండోసారి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ చకచకా పనులు చేసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో యువనేత కేటీఆర్కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అప్పజెప్పారు. ఇక రాష్ట్ర మంత్రివర్గ విస్తరణను ఈ నెలాఖరున జరపాలని కేసీఆర్ నిర్ణయించారని సమాచారం. 8 మంది ఇతరులు త్వరలోనే పార్టీలో చేరే అవకాశం ఉందని, ఈ పరిణామాల దృష్ట్యా మంత్రివర్గ విస్తరణకు తొందర పడాల్సిన అవసరం లేదని సీఎం పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆరు నుంచి ఎనిమిది మందికి తొలి విడతలో అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. లోకసభ ఎన్నికల వరకు ఇంతేనని తెలుస్తోంది.
వ్వక్తులు, కులాలు, ఇతర అవసరాల నుంచి కాకుండా, ప్రజల అవసరాలు తీర్చే విధంగా కొత్త మంత్రులను, విధేయులనే మంత్రివర్గ సహచరులుగా నియమించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు.
శాసనసభ సమావేశాలు కూడా అదే సమయంలో నిర్వహించి ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారని, అదే రోజు స్పీకర్, డిప్యూటి స్పీకర్ల ఎన్నిక జరుపుతారు. ఇదిలావుండగా ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో ఢిల్లీ వెళ్ళనున్నారని సీఎంవో వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలవనున్నారు. ఈనెల 21న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాష్ట్రానికి రానున్నరు. దక్షిణాది రాష్ట్రాల శీతకాల విడిదిలో భాగంగా హైదరాబాద్లోని బొల్లారం రాష్ట్రపతి భవన్లో 24 వరకు బస చేస్తారు. రాష్ట్రపతి వచ్చి వెళ్లే కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొంటారు.