తెరాస లోకి మరో కీలక నేత

SMTV Desk 2018-12-15 17:47:10  Athram Sakku, TRS , Asifabad MLA

ఆసిఫాబాద్, డిసెంబర్ 15: ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కొమరం భీం ఆసిఫాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికైన ఆత్రం సక్కు తెరాసలో చేరనున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే పది నియోజక వర్గాలలో తొమ్మిది నియోజకవర్గాలలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయమ్మా సాధించారు ,కాగా ఆసిఫాబాద్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోవడం తెలిసిందే. తెరాస అభ్యర్థి కోవ లక్ష్మిపై కేవలం 171 ఓట్ల మెజార్టీతో సక్కు గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ నుండి వొకే వొక్కడిగా నిలిచిన సక్కు టీఆర్‌ఎస్ పార్టీలో చేరేందుకు వెలమ సామాజికవర్గానికి చెందిన ఉన్నతస్థాయి వ్యక్తులతో జోరుగా మంతనాలు జరుపుతున్నట్లుగా సమాచారం. ఆదివాసీ, లంబాడిల మధ్య జరిగిన ఉద్యమంలో ఆదివాసీలకు ముఖ్య నాయకుడిగా ఉన్న సక్కు అప్పట్లో కీలకపాత్ర పోషించారు. నాటి నుండి నేటి వరకు ఆదివాసీల వెన్నుంటూ వస్తున్న నాయకుడిని పార్టీలో చేరితే ఆదివాసీ, లంబాడిల మధ్య ఉన్న గొడవలు సద్దుమణిగే అవకాశాలు ఉన్నందున పార్టీలో చేర్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.