హైదరాబాద్, డిసెంబర్ 02 : మరో 5 రోజులలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. కీలకమైన ఈ సమయంలో తెరాస, టీజెఎస్ పార్టీలలో ఇద్దరు నేతలు రాజీనామా చేశారు. ప్రముఖ న్యాయవాది, మానవహక్కుల సంఘాల కార్యకర్త రచనారెడ్డి టీజెఎస్కు రాజీనామా చేస్తున్నట్లు ఈరోజు ప్రకటించారు. తెరాసకు వ్యతిరేకంగా వొంటరిగా పోరాడుతమని చెప్పిన కోదండరామ్ కాంగ్రెస్తో చేతులు కలిపి ప్రజాకూటమిలో చేరారని రచనారెడ్డి ఆరోపించారు. టీజెఎస్లో అసలైన నాయకుల కంటే రాజకీయ బ్రోకర్లే ఎక్కువ ఉన్నారని ఆరోపించారు. టీజెఎస్ తన దిశ, లక్ష్యం రెండూ మార్చుకొని ఫక్తు రాజకీయ పార్టీలా ముందుకు సాగుతుండటంతో దానిలో ఇమడలేక రాజీనామా చేస్తున్నానని చెప్పారు. అసలు నేను టీజెఎస్ పార్టీలో ఎందుకు చేరానో తెలియని పరిస్థితి ఏర్పడిందని రచనారెడ్డి అన్నారు.
ఇక తెరాసకు నల్గొండ జిల్లాలో దుబ్బాక నరసింహా రెడ్డి ఈరోజు రాజీనామా చేశారు. ఈ సమయంలో ఆయన రాజీనామా చేయాలని నిర్ణయించుకోవడం వెనుక కాంగ్రెస్ నేతల ప్రోత్సాహం ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.