హైదరాబాద్, నవంబర్ 26: మాజీ సిబిఐ ఆఫీసర్ లక్ష్మీనారాయణ తన రాజకీయ ప్రవేశం గురించి వస్తున్న ఊహాగాలకు ముగింపు పలుకుతూ సోమవారం లోక్ సత్తా పార్టీలో చేరారు. ఆ పార్టీ నేత జయప్రకాష్ నారాయణ్ ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. లక్ష్మీనారాయణకు లోక్ సత్తా పార్టీ పగ్గాలు అప్పగించనున్నట్లు తాజా సమాచారం.
నిజానికి ఇవాళ్ళ సాయంత్రం హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో జనధ్వని పేరుతో లక్ష్మీనారాయణ తన సొంతపార్టీని ప్రకటిస్తారని మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ నిన్న ఆయన జయప్రకాష్ నారాయణ, మరికొంతమంది మాజీ ఐఏఎస్ అధికారులతో సమావేశమైనప్పుడు వారందరి సలహా మేరకు లోక్ సత్తా పార్టీలో చేరాలని నిర్ణయించుకొన్నారు.
కొత్తపార్టీ పెట్టడం, పార్టీ నిర్మాణం చేసుకోవడం ఆ తరువాత దానిని ప్రజలలోకి తీసుకువెళ్లి వారి ఆదరణ పొందడం అన్ని చాలా కష్టమైన పనులే. కనుక ఎన్నికలను ఎదుర్కోవడానికి అన్నివిధాలా సిద్దంగా ఉన్న, తన ఆశయాలకు అనుగుణంగా ఉన్నలోక్ సత్తా పార్టీలో లక్ష్మీనారాయణ చేరడం చాలా మంచి నిర్ణయమేనని చెప్పవచ్చు.
జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో లోక్ సత్తా పార్టీ ఎన్నికలలో విజయం సాధించలేకపోయినప్పటికీ ఆయనకున్న అనుభవం, మార్గదర్శనం లక్ష్మీనారాయణకు చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆయనకున్న ‘క్లీన్ ఇమేజ్ కారణంగా ప్రజలలో ఆ పార్టీకి మంచిపేరే ఉంది. ఇప్పుడు దానిలో లక్ష్మీనారాయణ వంటి నిజాయితీపరుడు, ప్రజా సమస్యలను పరిష్కరించలనే తపన ఉన్న వ్యక్తి జేరారు కనుక ఈసారి ఎన్నికలలో అది సానుకూల ఫలితాలు సాధించవచ్చు.