హైదరాబాద్, నవంబర్ 16: తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస పార్టీ ప్రాచారాల్లో తమ జోరు సాగిస్తూనే వుంది. అయితే నామినేషన్ల గడువు ఈ నెల 19 న ముగుస్తుండగా ఆ రోజు నుండే తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ వరుసగా ఎన్నికల ప్రచార సభలు నిర్వహించాలని నిర్ణయించారు. మొదటిరోజున మధ్యాహ్నం 2.30 గంటలకు ఖమ్మం జిల్లాలో ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలలో బహిరంగసభ నిర్వహిస్తారు. తరువాత మధ్యాహ్నం 3.30 గంటలకు జనగామ జిల్లాలో పాలకుర్తిలో బహిరంగసభ నిర్వహిస్తారు.
మరుసటిరోజు అంటే మంగళవారం మధ్యాహ్నం వొంటి గంటకు సిద్ధిపేటజిల్లాలో సిద్ధిపేట, దుబ్బాకలో, 2.30 గంటలకు హుజూరాబాద్, 3.30 గంటలకు సిరిసిల్ల, వేములవాడ, సాయంత్రం 4.30 గంటలకు ఎల్లారెడ్డి నియోజకవర్గాలలో సిఎం కేసీఆర్ వరుసగా బహిరంగసభలు నిర్వహిస్తారు.
సిఎం కేసీఆర్, ప్రతిపక్ష పార్టీల ప్రధాన నేతలు అందరూ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టబోతున్నారు కనుక రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఇంకా వేడెక్కనుంది.